నాదిర్షా భారతదేశ దండయాత్ర
From Wikipedia, the free encyclopedia
ఇరాన్ చక్రవర్తి, ఆఫ్షరిద్ పాలకవంశ స్థాపకుడు నాదిర్ షా ఉత్తర భారతదేశాన్ని 55 వేల బలమున్న గొప్ప సైన్యంతో దండయాత్ర చేశాడు. అందులో భాగంగా 1739 మార్చి నెలలో ఢిల్లీపై దాడి చేశాడు. అప్పటికే మరాఠాల దాడుుల, ఇతర సర్దార్ల స్వాతంత్ర్యం, అంతర్గత కుమ్ములాటల్లో ఘోరంగా బలహీనపడ్డ మొఘలులు కర్నల్ యుద్ధంలో అత్యంత తేలికగా ఓడిపోయారు. ఈ విజయంతో నాదిర్షా ఉత్తర భారతదేశంపై ఆధిపత్యాన్ని స్వీకరించాడు.[1]
ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. మార్చి 22న ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.[2] ఈ ఊచకోత జరుగుతుండగా మొఘల్ సామ్రాట్టు మొహమ్మద్ షా నాదిర్షాను తనపై, తన ప్రజలపై దయచూపాల్సిందిగా నగరం, రాజ్య ఖజానా తాళాలు అప్పగిస్తూ అర్థించాల్సిన స్థితివచ్చింది.[3] దీనికి ప్రతిగా నాదిర్షా ససైన్యంగా వెనక్కితగ్గేందుకు అంగీకరించినా, మహమ్మద్ షా ప్రతిఫలంగా రాజ్యపు ఖజానా తాళాలు అతని చేతికందించాల్సి వచ్చింది, చివరకు నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా సామ్రాట్టుకు కోల్పోయాడు. అప్పటి నుంచి నెమలి సింహాసనం పర్షియన్ సామ్రాజ్య ఆధిక్యానికి చిహ్నంగా నిలిచింది. అపార రత్నరాశుల నిధిలో, నాదిర్ కోహినూర్, దర్యా-ఇ-నూర్ వంటి వజ్రాలు పొందాడు. కోహ్-ఇ-నూర్ (కోహినూర్) అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం అనీ, దర్యా-ఇ-నూర్ అంటే కాంతి సాగరం అనీ అర్థాలు. వీటికి నాదిర్షాయే ఆ పేర్లు పెట్టాడు.[4]
నాదిర్షా తనకన్నా సైనిక శక్తి చాలా బలహీనంగా ఉన్న మొఘల్ చక్రవర్తిని రాజ్యానికి సుదూరమైన తూర్పు ప్రాంతాల్లో జయించడంతో పర్షియా ప్రత్యర్థి ఒట్టొమాన్ సామ్రాజ్యంపైనా, ఆపైన యుద్ధాల్లో తూర్పు కాసెసస్, మధ్య ఆసియాలపై పోరాడేందుకు తగ్గ బలాన్ని, స్థైర్యాన్ని అందించింది.[5]