గ్లోబల్ వార్మింగ్
From Wikipedia, the free encyclopedia
గ్లోబల్ వార్మింగ్ (global warming; "భూగోళ/ప్రపంచ కవోష్ణత"[5]) అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు[6] (climate change; క్త్లెమేట్ చేంజ్) లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.[7] గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పు అనే మాటలను తరచూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. శీతోష్ణస్థితిలో మార్పు అంటే గ్లోబల్ వార్మింగ్తో పాటు, దాని వలన అవపాతంలో (వర్షం, మంచు కురవడం వంటివి) ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర-పూర్వ కాలాల్లో కూడా జరిగినప్పటికీ, 20 వ శతాబ్దం మధ్యకాలం నుండి జరిగిన ఉష్ణోగ్రతల పెరుగుదల, అంతకు ముందెన్నడూ జరగనివి.
శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ పానెల్ (IPCC) ఐదవ మదింపు నివేదికలో "20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఏర్పడిన ఉషోగ్రతల పెరుగుదలకు అతి ముఖ్యమైన కారణం మానవుడే అనడానికి ఎంతో అవకాశం ఉంది" అని చెప్పింది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం. నివేదికలో సంగ్రహించిన శీతోష్ణస్థితి నమూనా అంచనాలు, భవిష్యత్తు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల రేటు, శీతోష్ణస్థితి ప్రతిస్పందనలపై ఆధారపడి, 21 వ శతాబ్దంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 0.3 to 1.7 °C (0.5 to 3.1 °F) వరకూ, అత్యధికంగా 2.6 to 4.8 °C (4.7 to 8.6 °F) వరకూ పెరిగే అవకాశం ఉందని సూచించాయి. ఈ పరిశోధనలను ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ సైన్స్ అకాడమీలు గుర్తించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చెందిన ఏ శాస్త్రీయ సంస్థ కూడా ఈ సూచనలపై విభేదించలేదు.[8][9]
గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలలో సముద్ర మట్టాలు పెరగడం, అవపాతంలో ప్రాంతీయ మార్పులు, వేడి తరంగాల వంటి తీవ్ర శీతోష్ణస్థితి సంఘటనలు, ఎడారుల విస్తరణ ఉన్నాయి. మహాసముద్రాల ఆమ్లీకరణ కూడా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల సంభవిస్తుంది. ఇది ఉష్ణోగ్రతల వలన జరగనప్పటికీ సాధారణంగా ఆ ప్రభావాలతోటే దీన్నీ కలిపి చూస్తారు. ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల ఆర్కిటిక్లో అత్యధికంగా ఉంది. ఇది హిమానీనదాలు, శాశ్వత మంచు, సముద్రపు మంచుల తిరోగమనానికి కారణమౌతోంది. మొత్తంమీద, అధిక ఉష్ణోగ్రతల వలన ఎక్కువ వర్షం, హిమపాతం కలుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో కరువు, అడవి మంటలు పెరుగుతాయి. శీతోష్ణస్థితి మార్పు వలన పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంత మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి. అనేక సముద్ర తీర నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థలు మారిపోవడంతో అనేక జాతుల జీవులు అంతరించిపోవడం లేదా వలసపోవడం జరుగుతుంది. తక్షణమే ప్రభావితమయ్యే పర్యావరణ వ్యవస్థల్లో పగడపు దిబ్బలు, పర్వతాలు, ఆర్కిటిక్ లు ఉన్నాయి.[10]
గ్లోబల్ వార్మింగ్కు సమాజం ప్రతిస్పందించాల్సిన అంశాలలో ఉద్గారాల తగ్గింపు, దాని ప్రభావాలకు అనుగుణంగా మారడం, క్లైమేట్ ఇంజనీరింగ్ మొదలైనవి ఉన్నాయి. శీతోష్ణస్థితి మార్పులపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా కన్వెన్షన్ (యుఎన్ఎఫ్సిసి) ఛత్రం కింద వివిధ దేశాలు కలిసి పనిచేస్తాయి. 1994 లో అమల్లోకి వచ్చిన ఈ కూటమిలో దాదాపుగా ప్రపంచవ్యాప్త దేశాలన్నీ సభ్యులే. ఈ కూటమి అంతిమ లక్ష్యం "శీతోష్ణస్థితి వ్యవస్థలో ప్రమాదకరమైన మానవజనిత జోక్యాన్ని నిరోధించడం". ఉద్గారాలలో పెద్దయెత్తున కోతలు అవసరమని యుఎన్ఎఫ్సిసికి చెందిన సభ్యులంతా అంగీకరించినప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ను 2 °C (3.6 °F) కన్నా తక్కువకు పరిమితం చెయ్యాలని 2016 పారిస్ ఒప్పందంలో తలపెట్టినప్పటికీ, భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పరిమితిలో ఇప్పటికే సగం వరకూ పెరిగింది. ఉద్గారాలను తగ్గిస్తామంటూ వివిధ దేశాలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలు భవిష్యత్తులో పెరిగే తాపాన్ని నియంత్రించడానికి సరిపోవు.