![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b9/Babri_Masjid.jpg/640px-Babri_Masjid.jpg&w=640&q=50)
బాబ్రీ మసీదు
From Wikipedia, the free encyclopedia
బాబ్రీ మసీదు భారతదేశంలోని అయోధ్యలో ఉన్న ఒక మసీదు. దీనిని హిందూ దేవుడైన శ్రీరాముడి జన్మస్థలం అని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇది 18 వ శతాబ్దం నుండి హిందూ ముస్లిం వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది.[1] మసీదు శాసనాల ప్రకారం, మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు దీనిని 1528–29 (935 AH) లో జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఈ మసీదును 1992 లో హిందూ కరసేవకులు దాడి చేసి పడగొట్టారు. ఇది భారత ఉపఖండంలో మత హింసను రేకెత్తించింది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b9/Babri_Masjid.jpg/640px-Babri_Masjid.jpg)
ఈ మసీదు రామ్కోట్ ("రాముడి కోట") అని పిలువబడే కొండపై ఉంది.[2] హిందువుల ప్రకారం, బాకీ ఆ స్థలంలో ముందుగా ఉన్న రాముడి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం ఉనికి వివాదాస్పదమైంది.[3] సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వివాదాస్పద స్థలంలో తవ్వకం నిర్వహించింది. తవ్వకం సమయంలో వివిధ వస్తువులను కనుగొన్నారు. ఈ శిథిలాలు హిందూ నిర్మాణం ఉనికిని పోలి ఉన్నాయి. అలాగే, బాబ్రీ మసీదును నిర్మించినది ఖాళీ స్థలంలో కాదనీ, త్రవ్వబడిన నిర్మాణం కింద ఇస్లామిక్ నిర్మాణాల జాడలు లేవని`ఇ సుప్రీంకోర్టు గుర్తించింది.[4][5]
19 వ శతాబ్దం నుండి, మసీదుపై హిందువులు ముస్లింల మధ్య అనేక విభేదాలు, కోర్టు వివాదాలూ ఉన్నాయి. 1949 లో, హిందూ మహాసభతో సంబంధం ఉన్న హిందూ కార్యకర్తలు మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా ఉంచారు. ఆ తరువాత మరింత వివాదాలను నివారించడానికి ప్రభుత్వం ఈ భవనాన్ని మూసివేసింది. హిందువులు, ముస్లింలు కోర్టును ఆశ్రయించారు.[6] ప్రజలు ప్రవేశించకుండా విధంగా పోలీసులు, గేట్లకు తాళాలు వేసారు.
1992 డిసెంబరు 6 న, విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరి, మసీదును కూల్చివేసారు. దానితో భారత ఉపఖండం అంతటా అల్లర్లు చెలరేగాయి. సుమారు 2,000 మంది మరణించారు.[7][8][9][10]
రామ జన్మస్థలం అని నమ్ముతున్న ప్రదేశంలోనే మసీదును నిర్మించారనే హిందువుల వాదనను అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబరులో సమర్థించింది. కేంద్ర గోపురం ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు మూడవ వంతు స్థలం కూడా లభించింది.[11][12] ఈ నిర్ణయం తరువాత అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టు నుండి అక్టోబరు వరకు దావాను విచారించింది.[12][13] 2019 నవంబరు 9 న, సుప్రీంకోర్టు దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి, మొత్తం స్థలాన్ని (2.77 ఎకరాల భూమి) హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలానికి బదులుగా ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.[14] ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం నుండి 19 మైళ్ళు (30 కి.మీ), అయోధ్య నుండి 11 మైళ్ళ (18 కి.మీ) దూరంలో ఉన్న ధన్నిపూర్ గ్రామంలో ప్రభుత్వం బోర్డుకు స్థలాన్ని కేటాయించింది.[15]