బాబ్రీ మసీదు కూల్చివేత
From Wikipedia, the free encyclopedia
అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి 1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం.
బాబ్రీ మసీదు కూల్చివేత | |
---|---|
ప్రదేశం | అయోధ్య, భారతదేశం |
తేదీ | 1992 డిసెంబరు 6 |
లక్ష్యం | బాబ్రీ మసీదు |
దాడి రకం | అల్లర్లు |
మరణాలు | 2,000 (including ensuing riots)[1] |
నేరస్తులు | భాజపా, విశ్వ హిందూ పరిషత్తులకు చెందిన కరసేవకులు |
హిందూ విశ్వాసాల ప్రకారం, అయోధ్య నగరం శ్రీరాముడి జన్మస్థలం. 16 వ శతాబ్దంలో మొగలు జనరల్ మీర్ బాకి, కొంతమంది హిందువులు రాముడి జన్మస్థలం అని భావించే ప్రదేశంలో బాబ్రీ మసీదు అనే పేరుతో ఒక మసీదును నిర్మించాడు. ఈ మసీదును, గతంలో ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలం లోనే నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.[2] [3] 1980 వ దశకంలో, విశ్వ హిందూ పరిషత్ (విహింప) ఈ ప్రదేశంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ (భాజపా) దానికి రాజకీయంగా గొంతు కలిపింది. ఈ ఉద్యమంలో భాగంగా ఎల్కె అద్వానీ చేసిన రామ రథయాత్రతో సహా పలు ప్రదర్శనలు, కవాతులూ జరిగాయి.
1992 డిసెంబరు 6 న భాజపాలు ఈ మసీదు వద్ద 1,50,000 మంది కరసేవకులతో ఒక ప్రదర్శన జరిపాయి. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ప్రదర్శనకారులు పోలీసులను పక్కకు నెట్టేసి, మసీదును కూలదోసారు. ఈ సంఘటనపై జరిపిన దర్యాప్తులో 68 మందిని దీనికి బాధ్యులుగా గుర్తించారు.వీరిలో అనేకమంది విహింప, భాజపా నాయకులు ఉన్నారు. ఈ మసీదు కూల్చివేత తరువాత అనేక నెలల పాటు దేశంలో హిందూ, ముస్లిముల మధ్య మతకలహాలు జరిగాయి .వీటిలో సుమారుగా 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాను, బంగ్లాదేశ్లలో హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి.