అయోధ్య వివాదం
అయోధ్య లోని మతపరమైన స్థలం కేంద్రంగా జరిగిన రాజకీయ, సామాజిక, మత వివాదం / From Wikipedia, the free encyclopedia
అయోధ్య వివాదం భారతదేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక, మతపరమైన వివాదం. ఇది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలోని ఒక స్థలంపై కేంద్రీకృతమై ఉంది. కనీసం 18వ శతాబ్దం నుండి హిందువులు తమ ఆరాధ్య దైవం రాముని జన్మస్థలంగా పరిగణిస్తున్న స్థలం ఇది.[1] ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదు చరిత్ర, దాని స్థానం, అక్కడ హిందూ దేవాలయం ఉండేదా, మసీదును నిర్మించేందుకు దాన్ని కూల్చేసారా అనే దాని చుట్టూ సమస్య తిరిగింది.
బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం రామ జన్మస్థలంగా చెప్పబడుతోందనేందుకు ఆధారాలు కనీసం 1822 నుండి ఉన్నాయి. ఫైజాబాద్ కోర్టులో సూపరింటెండెంట్ అయిన హఫీజుల్లా 1822లో కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో అతను, "బాబరు చక్రవర్తి స్థాపించిన మసీదు, రాముడి జన్మస్థలం వద్ద ఉంది" అని పేర్కొన్నాడు. [2] 1855లో స్థానిక ముస్లింలు సమీపంలోని హనుమాన్ గఢీ దేవాలయం పూర్వపు మసీదు స్థలంలో నిర్మించబడిందని భావించారు. ఆ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు, ఫలితంగా హింసాత్మక ఘర్షణలు జరిగి అనేక మంది ముస్లింల మరణానికి దారితీశాయి. [3] 1857 లో, బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలం అనుకునే స్థలంలో ఒక చబుత్రాను (వేదిక) నిర్మించారు. ఈ వివాదం పర్యవసానంగా 1885 లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలానికి గుర్తుగా భావించే చబుత్ర చుట్టూ ఆలయాన్ని నిర్మించనీయాలని అభ్యర్థిస్తూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ స్థలంపై హిందూ పక్షానికి యాజమాన్య హక్కులు లేవని పేర్కొంటూ తిరస్కరించబడింది. ఈ నిర్ణయంపై ఒక సంవత్సరం తర్వాత అప్పీల్ చేసారు. ఫైజాబాద్ జిల్లా కోర్టు, "చాలా సమయం గడిచిందని ప్రస్తావిస్తూ" మరోసారి తిరస్కరించింది. అయితే "హిందువులు ప్రత్యేకంగా పవిత్రంగా భావించే భూమిలో మసీదు చాలా దురదృష్టకరం. కానీ ఆ సంఘటన 356 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి చాలా ఆలస్యమై పోయింది." అంటూ హిందూ పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది, [4] [5] [6] [7] దీని తర్వాత 1934 లో జరిగిన గోహత్య తర్వాత అల్లర్లు జరిగి బాబ్రీ మసీదును దెబ్బతింది. 1949లో రామ భక్తులు మసీదులో విగ్రహాలను ఉంచారు, ఆ తర్వాత ఈ నిర్మాణం లోకి ముస్లింల ప్రవేశం నిషేధించబడింది.
1992 డిసెంబరు 6న జరిగిన రాజకీయ ర్యాలీలో బాబ్రీ మసీదు ధ్వంసం చేయబడింది. భారత ఉపఖండం అంతటా అల్లర్లు చెలరేగాయి. [8] [9] [10] [11] గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటిలో ఒకటి 1990 లో అయోధ్య కాల్పుల ఘటనకు దారితీసింది. [12] అలహాబాద్ హైకోర్టులో భూమి హక్కు కేసు దాఖలు చేయబడింది. దాని తీర్పు 2010 సెప్టెంబరు 30 న వెలువడింది. ఆ తీర్పులో, అలహాబాద్ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని తీర్పు ఇచ్చారు, విశ్వహిందూ పరిషత్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లా లేదా బాల రామునికి మూడవ వంతు, [13] మూడవ వంతు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, మిగిలిన మూడవది హిందూ మత శాఖ అయిన నిర్మోహి అఖారాకు వెళుతుంది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు, అయితే అదే స్థలంలో మసీదు కంటే ముందు ఆలయ నిర్మాణం ఉండేదని అంగీకరించింది. [14] [15] [16]
ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం టైటిల్ వివాద కేసులను 2019 ఆగస్టు నుండి అక్టోబరు వరకు విచారించింది.[14][17] 2019 నవంబరు 9 న, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కోర్టు తమ తీర్పును ప్రకటించింది; ఇది మునుపటి నిర్ణయాన్ని రద్దు చేసి, పన్ను రికార్డుల ఆధారంగా ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు చెప్పింది. [18] హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు భూమిని ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. మసీదును నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. [19]
2020 ఫిబ్రవరి 5న, భారత ప్రభుత్వం అక్కడ రామ మందిరాన్ని పునర్నిర్మించడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటన చేసింది. [20] మసీదును నిర్మించేందుకు అయోధ్యలోని ధన్నిపూర్లో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది.[19][21] [22]
2024 జనవరి 22 న భారత ప్రభుత్వం, రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించింది.[23] కొత్త శకానికి నాందిగా పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విగ్రహ ప్రతిష్ఠ చేసాడు. [23] 2024 డిసెంబరు నాటికి ఆలయం పూర్తిగా పూర్తవుతుందని భావిస్తున్నారు [24]